26, జులై 2008, శనివారం

"రాగాల" ఋతువు

వెనక గది నుంచి పెద్ద పెట్టున ఏడుపులు వినిపించాయి. నేను ఉలిక్కిపడ్డాను. ముందు గదిలో ముందు నెల పేపర్ చదువుతూ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అప్ డేట్ చేసుకుంటున్న నేను వెంటనే పేపర్ అక్కడ పడేసి వెనక గది లోకి వెనక గదిలోకి పరిగెట్టాను. మా నాయనమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరికి నాయకత్వం వహిస్తూ పెద్ద పెట్టున ఏడుస్తోంది. నాకు ఏమి జరిగిందో, ఎవరికి ఏమైందో అర్ధం కాలేదు. ఎవరినైనా అడుగుదాం అనుకున్నా వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి అడగటానికి భయం వేసింది. అదే సమయం లో పక్కింటి లోంచి, ఎదురింటి లోంచి, వెనకింటి లోంచి కూడా కోరస్ గా ఏడుపులు వినిపించాయి. ఆహా ఏం కో-ఆపరేషను. ఎంత ఎంత పక్క పక్క ఇళ్ళలో ఉంటే మాత్రం ఏడవడం లో కూడ మరీ ఇంత తక్షణ సహాయమా? ఇంతలో మా నాయనమ్మ ఒకేసారి ఏడుపు లెవెల్ పెంచింది. "ఓరి మాయదారి దేవుడో! అప్పుడే తీసుకెళ్ళిపోయావా?" అని పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అక్కడ కూర్చున వాళ్ళు కోరస్ గా పెద్ద పెట్టున ఏడుపు సౌండ్ పెంచారు.

అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దున కదా! నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నది ఎవరో దగ్గరి వాళ్ళకి ఏదో అయినందుకు కాదు, టి.వి. లో వస్తున్న "ఋతు రాగాలు" సీరియల్ లో ఏదో పాత్ర ( రాజీవ్ కనకాల అనుకుంటా) చనిపోయినందుకు!!. ఎవరికి ఏమి కాలేదన్న కొంచెం ఆనంద పడినా, నాకు జీవితం మీద విరక్తి మొదలయ్యింది. అప్పటికి మా నాయనమ్మ కి, సీరియల్స్ మిస్ అవ్వకుండా ఒక "బ్రేక్" లో వంట చేసి, ఇంకో "బ్రేక్" లో తిండి పెట్టడం లాంటి కళలలో చేయి తిరిగిపోయిందని తెలుసు కాని, మరీ ఇంతలా సీరియల్స్ పాత్రలని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయిపోతుందని నాకు అప్పుడే తెలిసింది.

అసలు "ఋతు రాగాలు" కొంచెం ఫరవాలేదు. నా జీవితం లో కొద్దో, గొప్పో ఫాలో అయిన సీరియల్ అదే. చివరిలో సీరీయల్ ని సాగదీయడం. "దేవదాస్ కనకాల" పాత్ర మృతృయుంజయుడులా ఎన్ని తరాలైనా అంతే యవ్వనంతో ఉండటం లాంటి కొన్ని విషయాల వల్ల చూడటం మానేసాను.

ఇంకొన్ని సీరియల్స్ అయితే మరీ ఘోరం. ఎపిసోడ్ మొదలయ్యెప్పుడు "టైటిల్ సాంగ్" ఒక 5 నిముషాలు, "జరిగిన కధ" ఒక 5 నిముషాలు, అయిపోయెప్పుడు మళ్ళి "టైటిల్ సాంగ్" 5 నిముషాలు, ఇలా 15 నిముషాలు, 30 నిముషాల సీరియల్ టైం లో పోగా. మిగతా 15 నిముషాలలో సీరీయల్ ని సాగదీయడానికి వీలయినంత కృషి చేస్తుంటారు. కింద గది లో ఫోన్ మోగుతూంటుంది. 26 మెట్లున్న మేడ దిగడానికి మెట్టుకి 30 సెకన్ల చొప్పున 13 నిముషాలు పడుతుంది. ఇంకో 2 నిమిషాలు ఫోన్ తీయాలా? లేదా? అని పాత్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపుల కెమేరాని ఎడం వైపు పది నుంచి సార్లు, కుడి వైపు నుంచి పది సార్లు , పై నుంచి పది సార్లు , కింద నుంచి పది సార్లు చూపిస్తారు. ఇన్ని సార్లు చూసి మనకి కళ్ళు తిరుగుతుండగా పెద్ద సౌండ్ తో "టైటిల్ సాంగ్" మొదలు అవుతుంది. "తరవాయి భాగం రేపు" అన్నమాట. ఫోన్ తీస్తాడా? తీయడా? అనే సస్పెన్స్ మనకి బోనస్. ఈ సస్పెన్స్ తో ఈ సారి మనకి బుర్ర కూడా తిరుగుతుంది. ఇంకా మనం బతుకుంటే తర్వాత సీరీయల్ చూసె సహనం సారీ!! కెపాసిటీ మనకి వచ్చేసినట్టే. అత్త కోడళ్ళ సీరియల్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.

మన టి.వి. వీక్షకుల సహనం చూసిన తరవాత నాకు కూడ "జీడి పాకం" అనే సీరియల్ తీద్దామని ఉంది !!! కధ కొంచెమైనా లేకుండా సీరియల్ ని "బబుల్ గం" లాగా సాగదీసే సామర్ధ్యం ఉన్న ఉత్సాహవంతులైన రచయితలకి ఇదే నా ఆహ్వానం. ఇంతకు ముందు "జీళ్ళు" తయారుచేసిన వారికి ఫ్రిపరెన్స్ ఇవ్వబడును.

24, జులై 2008, గురువారం

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

గమనిక : సరదాకి రాసింది మాత్రమే!

23, జులై 2008, బుధవారం

తెలుగు వారిలో నాకు నచ్చని ఒకే ఒక్క పధ్ధతి

ఇది సుమారు 5 ఏళ్ళ కిందట జరిగిన సంఘటన. అప్పుడు నేను బెంగుళూరులో ఒకానొక సాప్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాను. మా టీంలో ఇద్దరు బెంగాలీలు ఉండేవాళ్ళు. మాములుగా మేమందరం మాట్లాడుకొనేప్పుడు అందరికి అర్ధం కావటనికి ఇంగ్లిషులోనో, హిందిలోనో మాట్లాడేవాళ్ళం. కాని ఆ రోజు వాళ్ళకేమైందో తెలియదు గాని బెంగాలీలొ ఏదో చాలా సీరియస్ గా చర్చించుకొంటున్నారు. కాసేపు చూసా, మన వాళ్ళూ మేటర్ ఏమి లీక్ చేయడం లేదు. మనకసలే ఉత్సహం ఎక్కువ కదా! ఉత్సుకత ఆపుకోలేక "మేటర్ ఏంటి?" అని ఇంగ్లిషులో అడిగేసాను.

ఇంతకీ మేటర్ ఏంటంటే, మన వాళ్ళు అంతకుముందు ఆదివారం ఏదో బెంగాలీ పండగ ఉండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతను కూడా బెంగాలినే. వీళ్ళకొచ్చిన సమస్య అతని వల్ల కాదు. 7 ఏళ్ళు అయిన నిండని వాళ్ళ అబ్బాయి వల్ల. మహా అయితే బాగా అల్లరి చేసి ఉంటాడు అంతకుమించి అంత చిన్న బుడతడు వీళ్ళకేమి సమస్య తేగలడు అనుకుంటున్నారా? కాని తెచ్చాడు. ఆ బుజ్జాయి తన ముద్దు ముద్దు మాటలతో "అంకుల్ హౌ ఆర్ యు?" , "హౌ డు యు డు" ఇలా తప్పిస్తే ఒక్క బెంగాలి మాట కూడ మాట్లాడ లేదంట. అంతే అంత చిన్న విషయానికి వీళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి మాతృభాష రాని వాడు ఏమి బాగుపడతాడు. చిన్న పిల్లాడు వాడికి తెలియదు తల్లిదండ్రులు అయినా చెప్పచ్చు కదా ఇలా సీరియస్ అయిపోయారు. (నాకు బెంగాలీ రాకపోవడం వల్ల తెలియలేదుగాని వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో బూతులు కూడా ఉన్నాయట).

అసలూ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా?
కూల్ గా అదే ఈ సీన్ లో తెలుగు వాళ్ళని ఊహించుకోండి ( ఎవరి టార్టాయిస్ లు వాళ్ళే తెచ్చుకొని కళ్ళ ముందు గుండ్రం గుండ్రం గా తిప్పుకోగలరు)

1. "మా అమ్మాయికి అసలు తెలుగే రాదు. ముద్దు ముద్దు గా ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో" అని ప్రోత్సహించే తల్లిదండ్రులు.
2. "మా అబ్బాయికి తెలుగు చదవటం, రాయడం రాదు తెలుసా! అసలు మనం కూడా వాడితో ఇంగ్లిష్ లో మాట్లాడలేము" అనే పొగిడే నాన్నలు.
3. "మా అమ్మాయికి అసలు మాట్లడటం "మమ్మీ! మమ్మీ!" అని ఇంగ్లిష్ లోనే మొదలుపెట్టింది" అని మురిసెపోయే అమ్మలు.

మీక్కూడా వీటిలో ఏదో సీన్ కనిపించిందా? అనుమానం లేదు తెలుగు వాళ్ళు ఎవరికైనా ఇలాగే కనిపిస్తుంది. అసలు మనకి భాషాభిమానం చాలా చాలా తక్కువ. తమిళులు, బెంగాలీలు, అంతెందుకు వేరే ఏ భాష వాళ్ళతో పోల్చినా మన వాళ్ళ భాషాభిమానం తక్కువే అని అనిపిస్తుంది. వీళ్ళ నుంచి భాషాభిమానంలో మనం నేర్చుకోవల్సింది చాలా ఉంది.

అందుకే తెలుగు వాళ్ళు అందరు నన్ను తిట్టినా సరే "తెలుగు వాళ్ళలో నాకు నచ్చని ఒకే ఒక పధ్ధతి - భాషాభిమానం లేకపోవడం".

మనం అయినా మన పిల్లలకి అయినా తెలుగులో మట్లాడటం, చదవటం,రాయడం నేర్పించి మన మాతృభాషని కాపాడుకుందాం. సాధ్యమైనంతవరకు తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. వాళ్ళకి వచ్చినా రాకపొయినా పరాయి భాష వాళ్ళతో కూడా తెలుగులోనె మాట్లాడదాం (తమిళం వాళ్ళ లాగా. నిజంగా భాషాభిమానానికి రేటింగ్ ఇస్తే వీళ్ళు మొదటి స్థానం లో ఉంటారు. మన వాళ్ళ ఎక్కడ ఉంటరో చెప్పక్కరలేదు). నా లాంటి బ్రహ్మిలకి, ఇంకా కొంతమందికి అన్ని వేళలా ఆఫీస్ లో తెలుగు మాట్లాడటం సాధ్యం కాకపోవచ్చు కాని సాధ్యమైనంతవరకు తెలుగులోనే మాట్లాడదాం.

మన భాషని కాపాడుకోవడానికి ఈ చిన్న చిన్న పనులు మనం పాటిస్తే చాలు, పెద్ద పెద్ద ఉద్యమాలు అవసరం లేదు. ఏమంటారు?

గమనిక:
1. ఈ టపా సరదాకి రాసింది కాదు.
2. నిజం చెప్పాలి అంటే ఈ టపా కొంచెం ఆవేశం గానే రాసాను. ఏమైనా తప్పులు దొర్లి ఉన్న, ఎవరినైనా నొప్పించినా క్షమించగలరు. తెలియజేయండి. సరిదిద్దుకుంటాను.

22, జులై 2008, మంగళవారం

లెక్కల మాష్టారి ఫిలాసఫీ

నేను పాలిటెక్నిక్(డిప్లొమా) చదివేరొజుల్లో మాకు మొదటి సంవత్సరం సిలబస్ లో లెక్కలు కూడా ఉండేది. మా లెక్కల మాష్టారికి లెక్కలతో పాటు ఫిలాసఫీలో కూడా ఏదో పెద్ద డిగ్రీ(ఎం.ఫిల్ అనుకుంటా) ఉండేది. మా లెక్కల మాస్టారు ఫిలాసఫీ తోనే మాకు ఇంట్రడక్షన్ క్లాసు మొదలు పెట్టారు. "ప్రవహించే నీరు రాళ్ళ మీద ప్రవహించినప్పుడు ఎంత అందమైన శబ్దం వస్తుందో, మనం కూడ జీవితం అనే ప్రవాహం లో కష్టాలు అనే రాళ్ళు వచ్చినప్పుడు ఆగిపోకుండా సాగిపోయినప్పుడే మన జీవితం అందంగా అనందంగా మారుతుంది." ఇదీ ఆయన మాకు మొదటి క్లాసులో చెప్పిన మొదటి పాటం. అప్పట్లో ఏమి అర్ధం కాకపొయినా అద్భుతంగా ఉంది అనిపించింది.

తర్వాత క్లాసు నుంచి మాకు లెక్కలు చెప్పటం మొదలుపెట్టారు. బోర్దు మీద ఏదో లెక్క వేసారు. తర్వాత వెంటనే ఆన్సర్ వేసారు. నాకేమి అర్ధం కాలేదు. ఒకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. వాడు అర్ధం కాలేదు అని చెప్పాడు. ఏమిటోయ్ ఇది కూడ తెలియకపొతే ఎలా? అని కసురుకొన్నారు. ఇంకొకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. పాపం వాడు వెంటనే అర్ధం అయింది సార్ అని చెప్పాడు. ఇంతే కదోయ్ దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది అని తేల్చెసారు. దెబ్బతో "రాళ్ళూ-నీళ్ళు" ఫిలాసఫీ నాకు అప్పుడప్పుడే మెల్లిగా అర్ధం అవుతూ ఉన్నట్టు అనిపించింది. ఫస్టు క్లాసులో చెప్పిన ఫిలాసఫీ నెక్స్ట్ క్లాసుకే జీవితం లో ఎదురవడం నాతో పాటు చాలా మంది జీర్ణించుకొలేకపొయారు.

ఈ దెబ్బతో పదో తరగతిలో మా లెక్కల మాష్టారి ప్రియ శిష్యుడైన నాకు లెక్కలంటె భయం వచ్చేసింది. లెక్కల్లో నా పొజిషన్ "Cos O" గా ఫీల్ అయ్యే నేను "Sin O" అయిపొయాను అని తెలుసుకొవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. దీనికి తోడు సర్వాంతర్యామి లాంటి త్రికోణమితి (Trigonometry) త్రికోణమితి లోను, కాలుక్యులస్ లోను , నా మొహం లోను, అన్నిటిలోను ఉండేది. త్రికోణమితి పెట్టినప్పుడు ఒక చాప్టర్ లో పెట్టచ్చు కదా. అన్నిటిలోను ఇదే పెట్టాలా? అసలు నేను లెక్కలు ఎందుకు చెయ్యాలి? భవిష్యత్తులో "C" లో "printf" లు "Java" లో "println" రాయాల్సిన వాడికి ఈ తొక్కలో లెక్కలు అవసరమా? ఇలాంటి కొత్త కొత్త ఫిలాసిఫీలు నాకు కూడా వచ్చేసేవి.

ఫ్రిన్సిపాల్ గారికి చెప్దామా అంటే, అసలే మా లెక్కల మాష్టారు మన ముందు చంద్ర బాబు నాయుడు ని నిలబెట్టి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అని మన చేతే ఒప్పించగల సమర్ధుడు. మొదటికే మోసం వస్తుంది అని డ్రాపయిపోయాం.

ఇలాంటి కొన్ని దురదృష్టకరమైన క్లాసుల మధ్య ఆ సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు వచ్చేసాయి. జీవితంలో మొదటి సారి పరీక్షలు అంటే భయపడ్డాను. ఏదో లాగా ఎగ్జాం రాసేసాను. సెలవలు నుంచి వచ్చిన తర్వాత మార్కులు చూసుకుంటె 50 కంటె కొంచెం ఎక్కువ వచ్చాయి. జీవితం లో ఎప్పుడూ 70 కంటె తక్కువ మార్కులు చూడని నేను ఆ మార్కులు చూసి ఏంచేస్తాం అదే ఎక్కువ అని ఫీల్ అవ్వల్సి వచ్చింది.

ఇలా మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?

19, జులై 2008, శనివారం

నా మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి

నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వెంటనే "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమా నుంచి అభ్యంతకరమైన సన్నివేశాలు తొలగించి దర్శక నిర్మాతలు బేషరతుగా క్షమపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇదేం కొత్త వివాదం అనుకుంటున్నారా? ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల గురించి వివాదాలు రేగుతున్నప్పుడు నేను కూడా గత కొన్ని సినిమాలగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి జరుగుతున్న సాంస్కృతిక అన్యాయాలను ఎందుకు నిలదీయలకూడదు అని ప్రశ్నిస్తున్నాను. "పోకిరి" సినిమా నుంచీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కించపరుస్తూనే ఉన్నారు. ఇంతకీ నన్ను మనోవేదనకి గురి చేసిన సన్నివేశం ఏంటంటె "ఆడు వారి మాటలకు అర్ధాలు వేరులే" సినిమాలో హీరొ అయిన వెంకటేష్ గారికి ఒక సమస్య వస్తుంది. హీరో గారి అనుకోకుండా చేసిన ఒక పని వల్ల సాప్ట్ వేర్లో పరమ భయకరమైన సమస్యలు వచ్చి పని చెయడం మానేస్తుంది. తర్వాత రోజుకల్లా ఆ సమస్యని పరిష్కరించాలి. హీరో గారికి జన్మతః పైట్లు & పాటలు అయితే వచ్చు కాని జావా రాదు కదా. హీరో గారు తీవ్రంగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైన నిర్ణయానికి వస్తారు. అంతే మన హీరో గారు క్వార్టెర్ మందు తాగి కోడింగ్ మొదలు పెట్టేస్తారు. ఒక రాత్రి లో జావా నేర్చుకొని సమస్యని అద్భుతంగా పరిష్కరిస్తారు.

ఇదే నిజమైతే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు తాగుబోతులు అయ్యి ఉండాలి, సాప్ట్ వేర్ కంపనీలు అన్నిటిలోను 24 గంటలు బార్లు బార్లా తెరిచి ఉండాలి. అసలే ఈ సీను చూసి నేను బాధ పడుతుంటే, వేరే వాడి బగ్గు నాకు అసైన్ చెసినట్టు మా మరదలు "బావ జావా అంత వీజీనా?" అని అడిగింది. అసలే సాప్ట్ అయిన నా సాప్ట్ వేర్ హృదయం బాధగా మూలిగింది. ఎడ్యుకేటెడ్ అయిన మా మరదలే ఇలా ఆలోచిస్తే ఇంక నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి?

అందుకే సాప్ట్ వేర్ ఇంజినీర్లు అందరు ఏకమై ముక్త కంఠంతో ఈ సాంస్కృతిక అన్యాయాన్ని ఖండించాలి. ఈ సందర్భంగా మనం ఈ కింది పనులు చేద్దాం.

1. జూలై 21 న మనం అందరం ఆఫీస్ లో పనులు మానెసి నిరసన తెలపాలి. ( రోజూ పని చేస్తున్నామా ఏంటి అనుకుంటె ఆ రోజు ఈ కారణం చెప్పి పని మానెయ్యండి)
2. పంజాగుట్ట నుంచి సి.యం. కేంప్ ఆఫిస్ వరకు పాద యాత్ర.
3. సెన్సార్ వాళ్ళు కొత్త రూల్సు పెడుతున్నారట. సాప్ట్ వేర్ ఇంజినీర్లని కించపరచే సన్నివేశాలు ఉందకూడదని డిమాండ్ చేద్దాం.
4. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉంటే ఆ సినిమా నిర్మాతని కఠినంగా శిక్షించాలి. అంటే కనిసం 3 సంవత్సరాలు మా మేనేజర్ కింద ఆన్ సైట్ కి సహారా ఎడారికి పంపించాలి.

గమనిక : ఈ టపా సరదాకి రాసింది మాత్రమే

blogger templates 3 columns | Make Money Online